మోదీ, రాహుల్‌ దక్షిణాదిలో పోటీ చేస్తారా?

Whether Modi And Rahul Contest From South India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను ఉపయోగించుకొని దక్షిణాదిలో నామ మాత్రంగా ఉన్న పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావించింది. ఎప్పటి నుంచో ఉత్తరాదిలో బలంగా ఉన్న ఈ పార్టీ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈశాన్య రాష్ట్రాలకు, కాస్త తూర్పు రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇక తూర్పు రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కాస్త బలపడింది. 

ఇక దక్షణాదిలో బలపడాలనే ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. తమిళనాడులో దూరేందుకు ప్రయత్నించినా పరిణామాలు అందుకు అనుకూలించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న బలం కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఎప్పుడూ పునాదులు కూడా బలంగాలేని కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం ద్వారా హిందూ ఓటు బ్యాంకు లాక్కుని బలపడాలని చూసింది. కోయంబత్తూరు, పట్టణంతిట్ట లోక్‌సభ నియోజకవర్గాల్లో కొద్దిగా పట్టు సాధించింది. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ భూభాగంలోకి భారత వైమానిక దళం చొచ్చుకుపోయి బాలకోట్‌లో బాంబులు కురిపించిన సంఘటనతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పార్టీ బలపడుతుందని బీజేపీ భావించింది. ఈ సంఘటనతో హిందూ ఓటర్లను కొంత మేరకు బీజేపీ ఆకర్షించినా అది పార్టీ అభ్యర్థిని గెలుపించుకునే స్థాయిలో లేదు. పైగా బాలకోట్‌ దాడిలో 350 మంది ఇస్లాం ఉగ్రవాదులు మరణించారన్న ప్రచారాన్ని కూడా ఆ రెండు రాష్ట్రాల ప్రజలు విశ్వసించడం లేదు. ముస్లింలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా మునుపుటి బలం బీజేపీకి లేకుండా పోయింది. ‘పాకిస్థాన్‌తో యుద్ధం కోసం అనసరంగా డబ్బులను ఎందుకు వృధా చేస్తారు ? ఆ డబ్బును పిల్లల చదువుకోసం ఖర్చు పెట్టండి’ అంటూ ఆంధ్రా ప్రజలు వ్యాఖ్యానించడం గమనార్హం. 

సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానంతోపాటు కర్ణాటకలోకి బెంగళూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. 1989 నుంచి ఆ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు అనంత కుమార్‌ 2018లో మరణించారు. ఆయన భార్య తేజస్వని అనంత కుమార్‌ను అక్కడి నుంచి దించాలని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా హఠాత్తుగా మోదీ పేరు బయటకు వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళ నుంచి కూడా పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం విహిస్తున్న అమేథి నుంచి బీజేపీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఆమెతో ఓటమి భయం ఉండడంతోనే రాహుల్‌ కేరళ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నారంటూ బీజేపీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేసినట్లయితే సీపీఎం అభ్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు జాతీయ ప్రత్యర్థినాయకులు దక్షిణాది నుంచి పోటీ చేస్తారా, లేదా అన్నదానిలో బెంగళూరు స్థానం గురించి మార్చి 26వ తేదీన తేలిపోతుంది. కేరళ స్థానం గురించి తేలాలంటే ఏప్రిల్‌ నాలుగవ తేదీ వరకు నిరీక్షించాల్సి రావచ్చు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top