గ్రామీణ వైద్యులుగా గుర్తింపునిస్తాం: విజయసాయి రెడ్డి
ప్రకాశం జిల్లా: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి గ్రామీణ వైద్యులుగా తగు గుర్తింపునిస్తామని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి హామీనిచ్చారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా వైద్య విభాగం ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులతో ఆత్మీయ సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నాడు వైఎస్ హయాంలోనే శిక్షణ ఇచ్చి గుర్తింపునివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా గ్రామీణ వైద్యులకు ద్రోహం చేసిందని విమర్శించారు. ఇతర దేశాల్లో ఆరోగ్యానికి 12 శాతం బడ్జెట్లో కేటాయిస్తుంటే.. టీడీపీ ప్రభుత్వం 4 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యం బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుందని విమర్శించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ పేదలకు ద్రోహం చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వార్తలు