ఢిల్లీలో చంద్రబాబును ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు
ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని, ఎన్నికలప్పుడు ఎవరి టెన్షన్లలో వారుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట’ అని ట్వీట్ చేశారు.
ఫొటోల కోసం హింస పెడుతున్నాడట!
‘ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయావతి, అఖిలేశ్యాదవ్, రాహుల్గాంధీ, శరద్పవార్ను ఫొటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లో డబ్బు సంస్కృతికి పితామహుడు బాబు కాదా?
‘ప్రజలు ఓటుకు రూ.2 వేలు డిమాండు చేస్తున్నారని బాబు శోక సముద్రమయ్యాడు. ఈ సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ.. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నదెవరు? ఓటుకు కోట్లుకేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాకా నీతిమాలిన పనులకు తెగబడ్డా’వని విమర్శించారు.
చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అనే విషయం అర్థమైంది
‘యూపీఏ, మాయా–అఖిలేశ్ ఫ్రంట్లు చతికిలపడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు’ అని సాయిరెడ్డి ఇంకొక ట్వీట్ చేశారు.