దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు!
చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం
ట్విటర్లో విజయసాయి రెడ్డి ఫైర్
సాక్షి, అమరావతి : దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.1.5 కోట్లు నాకేసిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం తొలిసారి వింటున్నామన్నారు. శనివారం ట్విటర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం దుబారఖర్చుపై ధ్వజమెత్తారు.
లోకేశ్ చిటికెడు మెదడు చిట్లినట్టుంది..
‘మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.’ అంటూ చురకలంటించారు.
ఎందుకు ఆగావు ఉమా?
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.
ఇక చంద్రబాబు దుబార ఖర్చుల లెక్కలు ఒక్కొక్కటి బయట పడుతుంటే జనాలు నోరెళ్లపెడుతున్నారు. తన నివాసంలో పాములు పట్టడానికి రూ.7.50 లక్షలు, టాయిలెట్ పునఃనిర్మాణం కోసం రూ.9.50 లక్షలు ఖర్చుపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్ అయింది.