రాష్ట్రానికి జగన్‌ అవసరం

Vijaya Sai Reddy Meeting In Visakhapatnam - Sakshi

ప్రజాసంకల్పయాత్ర చారిత్రాత్మకం

ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌ సీపీ క్లీన్‌స్వీప్‌

విజయోత్సవ సభలో ఎంపీ  విజయసాయిరెడ్డి

విశాఖపట్నం , పెదవాల్తేరు(విశాఖతూర్పు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి మూడు దశాబ్దాలపాటు ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయోత్సవ సభ పెదజాలారిపేటలోని విశాఖ ఫంక్షన్‌హాలులో సోమవారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కంచరపాలెంలో నిర్వహించిన జగన్‌ బహిరంగ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. వంచనపై గర్జన సభ విశాఖలో విజయవంతం అయినందున పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడే శ్రీకారం చుడుతున్నామన్నారు.

విశాఖలో టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని, గెలుపు పట్ల ఆ పార్టీ శ్రేణులు సందేహంలో పడ్డాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విశాఖలో వైఎస్సార్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల సొమ్ము రూ.4.5 లక్షల కోట్లు దోచుకున్న దొంగ అని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తరువాత విదేశాలకు పారిపోయే అవకాశముందన్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ సొమ్ము ఖజానాకు జమచేస్తే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సింగపూర్‌ మాదిరిగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్‌ మాట్లాడుతూ పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. పార్టీ శిక్షణ శిబిరాలు అంచనాలకు మించి విజయవంతంగా జరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే ««ధ్యేయంగా అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

విశాఖలో పార్టీ గెలుపు ఖాయం: ఎంవీవీ
విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖలో పార్టీ ఎంత పటిష్టంగా ఉందో పాదయాత్ర విజయవంతం ద్వారా తెలిసిందన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకుందన్నారు. పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని, బూత్‌ లెవెల్‌లో సైతం పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు ఖాయమన్నారు. పాదయాత్ర విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ కావాలి జగన్, రావాలి జగన్‌ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచించారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రతి కుటుంబానికి వివరించాలని కోరారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశాఖ నగరం వైఎస్‌ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, దక్షిణ సమన్వయకర్త డాక్టర్‌ రమణమూర్తి, ఎస్‌.కోట సమన్వయకర్త శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, ప్రధాన కార్యదర్శిగురుమూర్తిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ఫరూఖి, కార్యదర్శి యు.అప్పారావు, చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి పెదబాబు, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధసంఘాల నాయకులు పాల్గొన్నారు.

షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ
ఉత్తరాంధ్రలో సమస్యలు, వాటి పరిష్కారాలు అంశంపై షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్‌కు సంబంధించి పార్టీ ఐటీ విభాగం రూపొందించిన వెబ్‌సైట్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీచ్‌రోడ్డులోని విశాఖ ఫంక్షన్‌ హాలులో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. విజేతలకు రూ.15 లక్షల మేరకు నగదు బహుమతులు అందజేస్తామని మళ్ల తెలిపారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్ల కోసం వైఎస్సార్‌సీపీ వైజాగ్‌ఐటీవింగ్‌.కామ్‌/ఉత్తరాంధ్ర వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7659864170 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

జ్యోతిస్వరూప విద్యకు ఆర్థిక సాయం
గాయత్రి ఇంజనీరింగ్‌ కళాశాలలో సివిల్‌ బ్రాంచ్‌లో నాల్గవ సంవత్సరం చదువుతున్న జ్యోతిస్వరూపకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రూ.1.01 లక్షల చెక్కును అందజేశారు. విశాఖలో గత నెలలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సభలో విద్యార్థిని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల వాపస్‌ పథకం అమలు చేయనందున చదువుకు ఆటంకం కలుగుతోందని గోడు వెల్లబోసుకుంది. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి సదరు యువతికి సాయం చేయాలని విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణకు బాధ్యత అప్పగించారు. అధినేత ఆదేశాల మేరకు ఎంవీవీ సత్యనారాయణ ఆమె విద్య కోసం రూ.1.01 లక్షలు సమకూర్చారు. బీచ్‌రోడ్డులోని విశాఖ ఫంక్షన్‌హాలులో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో విజయసాయిరెడ్డి చేతులమీదుగా జ్యోతిస్వరూపకు చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రావాలి జగన్‌... కావాలి జగన్‌ అంటూ ఆమె నినాదాలు చేయడం విశేషం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top