పవన్ కల్యాణ్ రాజకీయం అంతా నటనే
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శ
సాక్షి, అమరావతి: పవన్కల్యాణ్కు రైతులపట్ల చిత్తశుద్ధిలేదని చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి వచ్చి నటిస్తున్నారని రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతి రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్ కల్యాణ్ ఇప్పుడు వచ్చి సినిమా షూటింగ్ తరహాలో నటిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని మారుస్తున్నట్లు ప్రభుత్వంఎక్కడా చెప్పలేదని మంత్రి వెలంపల్లి అన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఏమాత్రం అన్యాయం జరగదన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం అనవసరమన్నారు.
టీటీడీపై తప్పుడు కథనాలు రాసిన మీడియాపై పరువు నష్టం దావా
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని కించపరిచే విధంగా కథనాలను ప్రచురించిన ఒక మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేసినట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ రాష్ట్రంలోని 12 ప్రధాన ఆలయాల విశేషాలతో తొలిసారి ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయ శాఖ కమిషనర్ పద్మ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ..ఆలయాల పవిత్రతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దేవదాయ శాఖలో అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని.. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆలయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
సంబంధిత వార్తలు