కాంగ్రెస్ త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాల పునాదులపై ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆక్షేపించారు.
చివరకు న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే విధంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ స్పీకర్కు కూడా నోటీసులు అందేలా వ్యవహరించిందని, ఇది పాలనా వైఫల్యానికి పరాకాష్ట అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు మహ్మద్సలీం, మధుయాష్కీ, కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ కనుకుల జనార్దన్రెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజన్కుమార్యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్కుమార్, కార్యదర్శులు కుమార్రావు, ప్రేమ్లాల్, బొల్లు కిషన్ పాల్గొన్నారు.