ప్రియాంక హిందూవులను అవమానించారు!
యూపీ సీఎం యోగి విమర్శలు
సాక్షి, గౌతమ్ బుద్ధనగర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆమె తీరు హిందూవుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందన్నారు. దాద్రిలోని బిసాధ గ్రామంలో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ జన్మభూమిలోని తాత్కలిక రామమందిరం కోర్టు వివాదంలో ఉన్నందున.. తాను సందర్శించబోనని ప్రియాంక ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
టెంపుల్ సిటీగా పేరున్న అయోధ్యలో ఇటీవల రోడ్షో సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కోర్టు వివాదంలో ఉన్నందున రామజన్మభూమిని సందర్శించబోనని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందిస్తూ.. ‘రామమందిరం భూ వివాదంలో ఉన్నందున సందర్శించనని ఆమె అన్నారు. మరి ఆమె కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కూడా బెయిల్పై బయటకు ఉన్నారు. వాళ్లను కూడా ప్రియాంక కలుసుకోవడం లేదా?’ అని ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆమె సోదరుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులుండగా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాపై మనీలాండరింగ్ కేసులున్న సంగతి తెలిసిందే.