టీఆర్ఎస్కు ఓటేయొద్దు
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకమయితే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు?
ప్రభుత్వంపై ఒవైసీ ఎందుకు ఒత్తిడి తేవడం లేదు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్న వారంతా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేయొద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. వీటి అమలు విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న మౌనం తప్పుడు సంకేతాలను పంపుతోందని, ఈ మౌనాన్ని వీడి ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలని శనివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు. పార్లమెంటులో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ తెలంగాణలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్కు రహస్య స్నేహం ఉన్నందునే అలా ప్రకటించేందుకు వెనుకాడుతున్నాడని ఆరోపించిన ఉత్తమ్, ఈ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నిం చారు. మతపెద్దలను తీసుకుని ప్రగతిభవన్లో కేసీఆర్తో చర్చలు జరిపిన ఒవైసీ రెండు రోజుల్లో సీఎం ప్రకటన చేస్తారని చెప్పారని, మరి 25 రోజులు అయినా ఆ ప్రకటన ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీతో టీఆర్ఎస్కు రహస్య స్నేహం, ఎంఐఎంతో బహిరంగ స్నేహం ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు.
కాంగ్రెస్తోనే న్యాయం..
చింతలపాలెం (హుజూర్నగర్): మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్కు అంత ర్గత పొత్తు ఉందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో లోపాయికారి ఒప్పదం కుదుర్చుకుందన్నారు. మైనార్టీలకు, మిగతా వర్గాల వారికి మేలు జరగాలన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఈ ఎన్నికల్లో, సీపీఐ, సీపీఎం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఉత్తమ్ తెలిపారు.