కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం

Uttam Kumar Reddy fires on KCR and Harish Rao - Sakshi

     సంగారెడ్డి సభలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

     మనుషుల అక్రమ రవాణా కేసులో కేసీఆర్, హరీశ్‌ కూడా నిందితులే 

     కాంగ్రెస్‌తోనే ముస్లింలకు రక్షణ  

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డిని ఉపయోగించుకుని కేసీఆర్, తెలంగాణ సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన మైనార్టీల సభలో ఉత్తమ్‌ ప్రసంగించారు. ‘మేం అ«ధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ మరచిపోం. అక్రమ కేసులు పెట్టేవారి జాబితా తయారు చేసి, ఎవరెవరిని ఏమేం చేయాలో చేస్తాం. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అన్యాయం చేస్తే నీకూ అదే గతి పడుతుంది’అని తీవ్ర స్వరంతో కేసీఆర్‌ను హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేదని, డీజీపీ మహేందర్‌రెడ్డి చట్టం, న్యాయం ప్రకారం పనిచేయాలని అన్నారు. రాష్ట్ర పోలీసు అధికారులు వ్యక్తిగత చెంచాగిరీ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే తగిన విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు. విదేశాలకు మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన రషీద్‌ అలీఖాన్‌ అనే నిందితుడు 2004–05లో ఇచ్చిన నేర వాంగ్మూలం ప్రకారం కేసీఆర్, హరీశ్‌రావు కూడా నిందితులేనన్నారు. రషీద్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఎనిమిది మంది, హరీశ్‌రావు ఇద్దరు పేర్లు సిఫారసు చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రషీద్‌ ఇచ్చిన వాంగ్మూలం, ఎఫ్‌ఐఆర్‌లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు లేకున్నా ఎలా అరెస్టు చేస్తారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఆదర్శ ప్రజాప్రతినిధి జగ్గారెడ్డిని 2004కు సంబంధించిన కేసులో 14 ఏళ్ల తర్వాత అరెస్టు చేయడం తగదన్నారు. జగ్గారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

కాంగ్రెస్‌తోనే ముస్లింల సంక్షేమం
ముస్లింల సంక్షేమం, రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ఓట్ల ద్వారా ప్రజలు చెంప పెట్టులాంటి సమాధానం ఇవ్వాలని ఉత్తమ్‌ అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకడం ద్వారా టీఆర్‌ఎస్‌ వైఖరేంటో తేలిందన్నారు. ఎంఐఎం పార్టీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.30 కోట్ల విలువ చేసే భూమిని రూ.3 కోట్ల నామమాత్ర ధరకు ఇచ్చిందని ఉత్తమ్‌ ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు.

తెలంగాణను వ్యతిరేకిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించతలపెట్టిన గులాం నబీ ఆజాద్‌ సభను విఫలం చేసేందుకే జగ్గారెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ సభలో మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి భార్య నిర్మల మాట్లాడారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని, తన కుటుంబాన్ని కాపాడాలని నిర్మల కంటతడి పెట్టారు. పార్టీ నేతలు మధుయాష్కీ, సురేశ్‌ షెట్కార్, ఫకృద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top