‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్ జరిగేది’
అమిత్షా వ్యాఖ్యలపై ఉత్తమ్ అభ్యంతరం
ఆయన చరిత్రను వక్రీకరిసున్నారు
తెలంగాణపై హోంమంత్రి వ్యాఖ్యలు సరికాదు : ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారనడం సరికాదని హితవు పలికారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ జమ్మూకశ్మీర్ అంశంపై అమిత్షా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయాన్ని 5 సార్లు ప్రస్తావించారు. లోక్సభలో దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అన్నారు. అది సరికాదు. ఏ బిల్లుపై ఓటింగ్ జరగాలన్నా సభల తలుపులు మూసే ఓటింగ్ చేపడతారని అందరికీ తెలిసిందే. అమిత్షా వ్యాఖ్యలు గమనిస్తే తెలంగాణ ఏర్పాటును బీజేపీ తప్పుబడుతోందా. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వలేదా’అని ప్రశించారు.
(చదవండి : ఏపీ విభజనపై కాంగ్రెస్ అసత్యాలు: అమిత్ షా)
జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా నెహ్రూ అలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నియమకాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. పార్టీ అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన అందించిన సేవలు పార్టీని ఎంతో బలోపేతం చేశాయని కొనియాడారు.