మేము చంద్రుడిని, చుక్కల్ని కావాలన్నామా..!
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేయడం ఎలా అనైతికం అవుతుందని ప్రశ్నించారు. గతంలో బీజేపీ పొత్తుపెట్టుకోలేదా? అని నిలదీశారు.
అయినా బీజేపీని మేము ఏమి అడిగాం.. చంద్రుడ్ని తీసుకురమ్మన్నామా? లేదా చుక్కల్ని తీసుకురమ్మన్మామా? మా తండ్రి గారి కోరిక మేరకు ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాం అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. అందుకు బీజేపీ సమ్మతించకపోవడంతోనే తప్పని సరి పరిస్థితుల్లో కుటుంబ సంప్రదాయాన్ని కాదని సీఎం పదవిని చేపట్టానని, అయితే తన తండ్రి బాల్థాకరేకు ఇచ్చిన మాట కోసమే అలా చేశానని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. (40 ఏళ్లుగా వెతికా 63 వచ్చాయి ఇక మీరే వెతికి పెట్టాలి)
ఎన్నికలు పూర్తయిన వెంటనే బీజేపీ తన మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ తన స్థానంలో మరో శివ సైనికుడు సీఎంగా ఉండేవాడని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం పీఠం కోసం ఒప్పందం కుదరక పోవడంతో శివసేన బీజేపీకి దూరమైన సంగతి తెలిసిందే. తర్వాత తలెత్తిన పరిణామాలతో.. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.