వైఎస్ జగన్ సమక్షంలో 200 టీడీపీ కుటుంబాల చేరిక
గజపతినగరం(విజయనగరం జిల్లా): ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన 200 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. వారితో పాటు స్థానిక టీడీపీ నేత పైడిరాజు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన పైడి రాజు మాట్లాడుతూ.. అధికార తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే కేఏ నాయుడు అరాచకాలు ఎక్కువయ్యాయని, సీనియర్ నాయకుల పట్ల వివక్ష కారణంగా టీడీపీకి రాజీనామా చేశామని వెల్లడించారు. కనీసం అర్హులైన వారికి పింఛన్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరామని పైడిరాజు తెలిపారు.
తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేఏ నాయుడు హామీ ఇచ్చారని, నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోలేదని గజపతినగరం మండలం మల్లునాయుడు వలస గ్రామ మహిళలు జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరుతాయని పార్టీలో చేరిన మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే వైఎస్ జగన్ను గజపతినగరం మండలం జిన్నాం గ్రామానికి చెందిన మహిళలు, పాఠశాల విద్యార్థినులు కలిశారు. పింఛన్లు రావడం లేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కాలేదని వారు వైఎస్ జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమ స్కూల్ చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడం, మరుగుదొడ్ల సౌకర్యం లేనందువల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఊర్లో ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువకులు తాగి ఇబ్బంది పెడుతున్నారని, వారికి ఉద్యోగాలు కల్పిస్తే బయట ఊళ్లకు వెళతారని, దాంతో తమ ఇబ్బందులు తొలగిపోతాయని స్కూలు బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు.