కారులో పోరు!
25కుపైగా మున్సిపాలిటీల్లో నేతల మధ్య పోటీ
వలస ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు
టికెట్ల కోసం పట్టుబడుతున్న అనుచరగణం
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్ని కల కోసం టీఆర్ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్షేత్రస్థాయిలో కేడర్ నడుమ తీవ్ర పోటీ నెలకొంది. తమకు అవకాశమివ్వాలంటూ నియోజక వర్గ స్థాయిలో నేతలు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్చార్జిలపై ఒత్తిడి పెంచు తున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతోపాటు వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు, టీఆర్ఎస్ సీనియర్ నేతల నడుమ చాలా చోట్ల క్షేత్రస్థాయిలో సమన్వయం కనిపించడం లేదు. పార్టీలో పాత, కొత్త నాయకత్వం మధ్య వర్గపోరు నడుస్తుండటంతో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీఆర్ఎస్ అధిష్టానానికి సవాలుగా మారింది.
ఒత్తిడి పెంచుతున్న ఆశావహులు...
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ) కూడా టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు డజనుకుపైగా మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ ఇన్చార్జిల సమావేశంలో తాండూరు, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో టికెట్ల కేటాయింపులో ఎదురయ్యే ఇబ్బందులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రస్తావించారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు కొత్తగూడెం, కాగజ్నగర్, ఎల్లారెడ్డి, చిట్యాల, వైరా తదితర నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా 30కిపైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్లో వివిధ సందర్భాల్లో నేతల నడుమ వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు, క్రియాశీల కార్యకర్తలు తాము నమ్ముకున్న నాయకులపై టికెట్ల కోసం ఒత్తిడి పెంచడంతోపాటు తమ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గ్రూపుల గోల లేని మున్సిపాలిటీల్లోనూ టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు.
పార్టీ ఇన్చార్జిల నివేదికలే కీలకం...
మున్సిపాలిటీలు, వార్డులవారీగా టీఆర్ఎస్, ఇతర పార్టీల బలాబలాలు, సొంత పార్టీతోపాటు ఇతర పార్టీల్లో క్రియాశీల నాయకులు, కార్యకర్తల వివరాలతో పార్టీ ఇన్చార్జిలు గతంలోనే నివేదికలు రూపొందించారు. అయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో మరోమారు తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు రోజుల క్రితం జరిగిన పార్టీ ఇన్చార్జిల సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. పార్టీ ఇన్చార్జిల తాజా నివేదికలు, వార్డులు, డివిజన్లు, చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని గ్రూపు కొట్లాటలతో సంబంధం లేకుండా టికెట్లు కేటాయించాలని కేటీఆర్ పదేపదే ఆదేశిస్తున్నారు. అయితే వర్గపోరు అధికంగా ఉన్న కొల్లాపూర్, తాండూరు, కొత్తగూడెం లాంటి మున్సిపాలిటీల్లో తమకు టికెట్ దక్కని పక్షంలో ప్రత్యేక ప్యానెల్గా లేదా రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేని ఏదైనా పార్టీ గుర్తుపై పోటీ చేయాలని ఆశావహులు భావిస్తున్నారు. మరోవైపు 25కిపైగా మున్సిపాలిటీల్లో ఎంఐఎంతో కొన్ని వార్డుల్లో స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చని టీఆర్ఎస్ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇన్చార్జిల నివేదికలు అందిన తర్వాత జనవరి 2న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో జరిగే భేటీలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, అసమ్మతుల బుజ్జగింపు, తటస్థులు, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచార వ్యూహం తదితరాలపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.