పేరు గొప్ప.. ఊరుదిబ్బ
కేంద్ర పథకాల తీరుపై ఎంపీ కవిత విమర్శ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్షిస్తే పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న తీరుగా ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు పంపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వాడుకోలేదన్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులతో తాము డబ్బా కొట్టుకోవడం లేదన్నారు.
కేంద్రం పథకాల పేర్లను మార్చిం దే తప్ప, వాటిల్లో పాత స్ఫూర్తి కూడా కనిపించడం లేదన్నారు. కొన్ని పథకాల అమలు తీరు దయనీయంగా ఉందని చెప్పారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను మార్చుకునేలా స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తున్న శ్మశాన వాటిక డిజైన్ ఉత్తర భారతదేశంలో ఉండే శ్మశానవాటికల మాదిరిగా ఉందని, దక్షిణ భారతదేశంలోని శ్మశానవాటికల డిజైన్లా ఉండాలని సూచించారు. కేంద్రం పనితీరు అనుకున్నంత స్థాయిలో లేదని, ఈ విషయాన్ని లక్ష్మణ్ గమనించాలని కోరారు.