15 రోజుల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో
మరో నాలుగుసార్లు భేటీ తర్వాత కేసీఆర్తో చర్చ
కమిటీ తొలి భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మేనిఫెస్టో రూపకల్పనకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కసరత్తు ముమ్మరం చేసింది. మరో 15 రోజుల్లో మేనిఫెస్టోను తయారు చేయనుంది. ఈ మేరకు మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఇక్కడి తెలంగాణ భవన్లో జరిగింది. మొత్తం 15 మంది సభ్యులు హాజరయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు శేరి సుభా ష్రెడ్డిని కమిటీలో కొత్తగా చేర్చారు. సమావేశంలో 20 అంశాలపై చర్చ జరిగింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన 170 వినతిపత్రాల పరిశీలన మొదలైంది. మరో నాలుగుసార్లు కమిటీ సమావేశం కానుంది. అనంతరం ముసాయిదా ప్రతిపాదనలపై కేసీఆర్తో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. తర్వాత కేసీఆర్ అధికారికంగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.
సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ కె.కేశవరావు, సభ్యులు ఈటల రాజేందర్, నారదాసు లక్ష్మణ్రావు విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ముందు మంచి మేనిఫెస్టోను పెడతాం. మేనిఫెస్టో రూపకల్పన పదిహేను రోజుల్లో పూర్తవుతుంది. మరో 4 సమావేశాలు నిర్వహించి సీఎంతో చర్చించిన తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తాం. నిబంధనల ప్రకారం మేనిఫెస్టో ముసాయిదాను ఎన్నికల కమిషన్కు సమర్పిస్తాం. గత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను చాలా వరకు నెరవేర్చాం. కొత్తగా ఏ అంశాలను చేర్చాలనే అంశంపైనా చర్చించాం. వేరే పార్టీలు మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచాయన్న విషయంతో మాకు సంబంధం లేదు. అసెంబ్లీని రద్దు చేయడం అనేది రాజ్యాంగ ప్రకారం సంక్రమించిన హక్కు. అమిత్షా ఏం మాట్లాడినా... కొన్ని నెలల అధికారం ఉండగానే అసెంబ్లీని రద్దు చేయడం మా సాహసానికి నిదర్శనం. గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తాం. తాజా సర్వేలన్నీ అదే స్పష్టం చేస్తున్నాయి’అని అన్నారు.
బాబూమోహన్కు కేటీఆర్ బుజ్జగింపులు..
టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కని నేతలకు సర్ది చెప్పే ప్రక్రియ కొనసాగుతోంది. అందోల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ శనివారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ను కలిశారు. ఏ పరిస్థితుల్లో అభ్యర్థిత్వం మార్చాల్సి వచ్చిందో కేటీఆర్ ఆయనకు వివరించారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వపరంగా మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నేత దానం నాగేందర్ కూడా కేటీఆర్ను కలిశారు. నాగేందర్కు గోషామహల్ టికెట్ ఖరారు చేసినా అధికారికంగా వెల్లడించాలి. తాజాగా దానం ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను పెట్టినట్లు తెలిసింది. కార్పొరేటర్ విజయారెడ్డి పేరు ఈ స్థానానికి ఖరారు చేసినట్లు తెలిసింది. పెండింగ్లో పెట్టిన 14 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించనుంది.
మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఖరారుపై కేటీఆర్ కసరత్తు పూర్తి చేశారు. టీఆర్ఎస్ అధినేత ఆమోదం అనంతరం జాబితాను ప్రకటించనున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, చెన్నమనేని రమేశ్లు కేటీఆర్ను కలిశారు. అసంతృప్తుల విషయాలను మంత్రికి వివరించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సి.లక్ష్మారెడ్డి, జి.జగదీశ్రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు కలసి తాజా పరిస్థితులను వివరించారు.