పోటీ చతుర్ముఖం.. పోరు రసవత్తరం

Tough Fight For Municipal Elections In Ranga Reddy - Sakshi

అందరిచూపు గాంధీకాలనీ వైపు

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టి పోటీ    

సాక్షి, వికారాబాద్‌ అర్బన్‌:  ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో గాంధీ కాలనీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వికారాబాద్‌ మున్సిపాల్టీలో 32 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా అందరి చూపు మాత్రం గాంధీ కాలనీ వైపే ఉంది. ప్రతి మున్సిపల్‌ ఎన్నిల్లో ఈ వార్డులో భిన్నమైన ఫలితాలు వస్తుంటాయి. దీంతో ఇక్కడ పోటీలో ఉన్న నాయకుల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 28వ వార్డు పరిధిలోకి గాంధీ కాలనీ, పాత గంజ్‌ ప్రాంతాలు వస్తాయి. ఇక్కడ ఆర్యవైశ్యులు, మార్వాడీలు, బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బీజేపీ గెలుపునకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ప్రతి మన్సిపల్‌ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటారు.

ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థుల హడావిడి జోరుగా ఉంటుంది.  కాని వారి అంచనాలకు భిన్నంగా ఇక్కడ ఫలితాలు వస్తున్నాయి. 2005 సంవత్సరంలో బీజేపీ తరఫున కేపీ రాజు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి జయ నర్సింహ రావుపై 30ఓట్లతో ఓడిపోయారు. 2014లో ఈ వార్డు నుంచి బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. ఇదే వార్డుకు చెందిన అనుముల శ్రీను కుటుంబం నుచి పోటీలో ఉన్నారు. వీరి విజయం ఖాయమని అందరు అనుకున్నారు. కాని కాంగ్రెస్‌ అభ్యర్థి కొత్తగడికి చెందిన మంజుల కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఇలా గాంధీ కాలనీలో ఒకరు గెలుస్తారనుకుంటే మరొకరు విజయం సాధిస్తుండటంతో ఈ సారి ఎన్నికల ఫలితాలపై పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

ప్రధాన అభ్యర్థుల్లో.. 
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో నలుగురు ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ నుంచి మోముల స్వాతి పోటీలో ఉన్నారు. మోముల స్వాతి భర్త మోముల రాజ్‌కుమార్‌ చాలా కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. టికెట్లు కేటాయించే సమయంలో ఈ వార్డు నుంచి అరుణరాంనివాస్‌ రాఠికి టికెట్‌ కేటాయించారు. దీంతో రాజ్‌కుమార్‌ కుటుంబం ఎమ్మెల్యే నివాసం ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నా చేసి అందరి దృష్టిలో పడ్డారు. దీంతో చివరి నిమిషంలో రాజ్‌కుమార్‌ భార్యకు టికెట్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున సిట్టింగ్‌ కౌన్సిలర్‌  మంజుల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున యాస్కి శిరీష మల్లికార్జున్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా బీజేపీ నాయకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం ఈ ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్యవైశ్యుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాగా టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

గత ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్‌ కౌన్సిలర్‌తో పాటు, స్వతంత్ర అభ్యర్థి రాంనివాస్‌ రాఠీ భార్య ఫ్రిజ్‌ గుర్తుపై పోటీలో ఉండటంతో చతుర్ముక పోటీ నెలకొంది. ఈ చతుర్ముక పోటీలో విజయం ఎవరిని వరిస్తుందనే విషయంపై పట్టణ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ వార్డులో మొత్తం 1536 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించే అవకాశం ఉంది. చతుర్ముఖ పోటీ ఉండటంతో ప్రతి ఓటు కీలకంగా మారనుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top