అధికారపక్షాన్ని నిలదీద్దాం
హామీల అమలుపై అసెంబ్లీలో పట్టుబడతామన్న టీటీడీపీ, బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసగిస్తున్న అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ వేదికగా నిలదీయాలని బీజేపీ, టీటీడీపీలు నిర్ణయించాయి. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇరుపార్టీల నేతలతో గురువారం హైదరాబాద్లో సమన్వయ భేటీ జరిగింది. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్ష, టీడీఎల్పీ నేత పదవుల నుంచి రేవంత్ను తొలగించినట్టుగా రమణ ప్రకటించడంతో ఆయన హాజరుకాలేదని చెబుతున్నారు.
దోషిగా నిలబెడతాం: కిషన్రెడ్డి
ఎన్నికలపుడు ప్రజలకు హామీలిచ్చి, అమలుచేయకుండా మోసగిస్తున్న అధికార టీఆర్ఎస్ను శాసనసభలో నిలదీస్తామని కిషన్రెడ్డి చెప్పారు. సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి పోరాడుతామన్నారు.
టీఆర్ఎస్ను ప్రజల్లో దోషిగా నిలబెట్టాల్సిన సమ యం వచ్చిందని పేర్కొన్నారు. శాసనసభలో టీడీపీతో కలసి పనిచేస్తామని.. సభలో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు. అధికారపక్షం ప్రతిపక్షాలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఐక్యంగా పోరాడుతాం: సండ్ర
ప్రజా సమస్యలపై పోరాడుతామని, అధికార పక్షం తీరును నిలదీస్తామని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించి, పోరాడటానికి బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి సమన్వయం చేసుకుంటామన్నారు.