వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ధిక్కార స్వరం

Tammineni seetharam comments on cm chandrababu - Sakshi

     దమ్ముంటే కేంద్రంలోని మంత్రులతో రాజీనామా చేయించండి

     సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సవాల్‌

శ్రీకాకుళం అర్బన్‌: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం చంద్రబాబు కేంద్రంపై ధిక్కార స్వరం వినిపించేలా నటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే కేంద్రంలోని తన మంత్రులతో రాజీనామా చేయించి మద్దతును ఉపసంహరించుకోవాలని సవాల్‌ చేశారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఏనాడూ పల్లెత్తి మాట్లాడని చంద్రబాబు ఆకస్మికంగా రూటు మార్చి ఇపుడు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిపోతోందనడం హాస్యాస్పదమన్నారు. నాడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు, ఇప్పుడు కేంద్రం ఆదుకోకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నారని ఎద్దేవా చేశారు. విభజన వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, సంక్షేమం, అభివృద్ధి కుంటుపడుతుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆనాడు వివరంగా చెప్పడం జరిగిందన్నారు.

విభజనానంతరం రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనించాలంటే ప్రత్యేకహోదాయే శరణ్యమని జగన్‌ ఎంత మొత్తుకున్నా వినకుండా ప్యాకేజీకే చంద్రబాబు మొగ్గు చూపారని దుయ్యబట్టారు. 16 నెలలుగా ప్రధానిని కలవడానికి ప్రయత్నం చేయని సీఎం ఈనెల 12న ప్రధానిని కలిశారని, అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top