ఎంఐఎం మచ్చికకే నిజాం కీర్తన: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: నిజాం రాజును పొగుడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలు దగ్గర పడటంతో మత ప్రాతిపదికన ఓట్లు దండుకోవడానికి, ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి ‘నిజాం మన రాజు, చరిత్ర, ఘనత’ అని కేసీఆర్ కీర్తిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక వ్యక్తికో, మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని తెలిపారు. నిజాం తన అధికారాన్ని పదిలపర్చుకోవడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించారని, నిజాం వ్యతిరేక పోరాటంలో 4 వేల మంది ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ముస్లిం మైనారిటీలు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు.