బేవకూఫ్‌గాళ్లు!

Talasani Srinivas Yadav fires on Opposition leaders - Sakshi

విపక్ష నేతలపై మంత్రి తలసాని ఫైర్‌

హన్మకొండ: విపక్ష నేతలంతా బేవకూఫ్‌గాళ్లని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా చేపట్టని విధంగా తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం హన్మకొండలో అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సూట్‌కేసు దొంగ, ఆ దొంగ, ఈ దొంగ ఒక్కటై ముఠాగా ఏర్పడుతున్నారని కడిగిపారేశారు.

కొత్త బిచ్చగాళ్లలా కాంగ్రెస్‌ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారని, బస్సులో 32 మంది ఉంటే.. అందులో 18 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. అసలు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని వారు.. ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంతటి ఇంజనీర్‌ దేశంలో ఎక్కడా లేరన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్, ప్రాజెక్టుల నిర్మాణంపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ ఆ ఐదు సీట్లు గెలుచుకుంటే గొప్ప అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top