గడ్డాలు పెంచితే అధికారం వస్తుందా?

talasani srinivas yadav commented over uttam  - Sakshi

ఉత్తమ్‌పై మంత్రి తలసాని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తమ్‌కుమార్‌ గడ్డాలు, మీసాలు పెంచుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి అధికారం వస్తుందా అని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు, ఇప్పుడు అధికారం పోవడంతో పిచ్చిపట్టినట్టుగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 70 కాదు కదా 7 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రిటైర్మెంట్‌ వయసులో ఉన్నారని, ఏదైనా మాట్లాడవచ్చని అన్నారు. కానీ, మంత్రి కేటీఆర్‌ యంగ్‌ స్టార్‌ అని, ఆయనకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కచ్చితంగా 100 అసెంబ్లీ సీట్లు వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీని తాకడంతోనే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందని, ఉత్తి పుణ్యానికే తెలంగాణ ఇవ్వలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవో నిధులు వస్తున్నట్టు.., టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడం లేదన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడటం సరికాదని తలసాని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top