గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సోనియా గాంధీ
లక్నో : యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల బరిలో భాగంగా రాయ్బరేలి నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. నామినేషన్ వేసి బయటకు వచ్చిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ‘ఈ ఎన్నికల్లో మోదీని ఓడించలేమని భావిస్తున్నారా’ అని సోనియాను ప్రశ్నించారు.
అందుకు ఆమె బదులిస్తూ.. ‘అలా ఎన్నటికి జరగదు.. 2004 నాటి ఫలితాలను మర్చిపోకండి. అప్పుడు వాజ్పేయి జీ కూడా చాలా బలవంతుడిగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చరిత్రలో చాలా మంది తాము భారత దేశ ప్రజలకంటే బలవంతులమని అంహంకారంతో విర్రవీగారు. కానీ చివరకు అదే ప్రజల చేతిలో ఓటమికి గురయ్యారు. మోదీ మరి అంత బలవంతుడేం కాదు. ఆయన బలం ఈ ఎన్నికల్లో తేలిపోతుంది’ అన్నారు.
వాజ్పేయి 1996, 1998, 1999 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికి.. 2004 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఈ ఫలితాలను గుర్తు చేస్తూ సోనియా ఇలా వ్యాఖ్యానించారు.