‘రాజీనామాలు ఇప్పుడే కాదు’
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై టీడీపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామంటూనే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చంద్రబాబు సర్కారు చెప్పడం ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది.
ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అంగీకరించామని మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్వయంగా వెల్లడించారు. బుధవారం వీరిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికీ నమ్మకముందని, రాష్ట్రానికి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భయపడటం లేదు..
ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు భయపడటం లేదని, భయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఎప్పుడు ఏంచేయాలో తమ పార్టీ అధినేతకు తెలుసునని చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామాలు పెద్ద సమస్యేం కాదని, కానీ ఇప్పుడే తాము నిర్ణయం తీసుకోబోమని అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి స్పష్టం చేశారు.