ట్వీట్ ఫర్ థాట్
ఎన్నికల సందట్లో ట్వీట్ల గోల
ఇది ఎన్నికల కాలం.. నోటి మాటలు కొన్ని తూటాల్లాపేలిపోతాయి. ఇంకొన్ని తుస్సుమంటూ నవ్వుల పాలవుతుంటాయి. మరికొన్ని ఏళ్లు గడచినా అలా మన నోళ్లలో నానుతూనే ఉంటాయి. ‘రోటీ కపడా మకాన్‘ చివరి కోవకు చెందితే.. ఇండియా షైనింగ్ రెండో వర్గానిది!! మరి మోదీ తాజా నినాదం.. మై భీ చౌకీదార్..?కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ ఓ బహిరంగసభలో ప్రసంగిస్తూ.. అవినీతి అక్రమాలు జరక్కుండా తాను కాపలాదారుగా ఉంటానని.. ప్రజలు ఒక్కొక్కరూ జాగరూకతతో చౌకీదార్లుగా మారాలని సూచించారు. ఈ మాట కాస్తా వైరల్ అయిపోయింది.
ఒకవైపు ట్విట్టర్.. ఈ అంశంపై వాద ప్రతివాదాలతో హోరెత్తిపోగా.. సోషల్ మీడియాలోనూ చర్చోపచర్చలు జరిగాయి. మంత్రివర్గ సభ్యులు, బీజేపీ నేతలు చాలామంది తమ ట్విట్టర్ హ్యాండిళ్లకు ముందు ‘చౌకీదార్’ పదాన్ని జోడించుకుని మరీ మోదీకి మద్దతు పలికారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ పదం వాడుకపై తమదైన రీతిలో చెణుకులు, విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఒక ట్వీట్ చేస్తూ.. నేను అపాయింట్ చేసిన చౌకీదార్ కనిపించడం లేదని.. మంచిరోజులు (అచ్ఛే దిన్) వెతుక్కుంటూ వెళ్లినట్లు ఎవరో చెప్పారని వ్యంగ్యోక్తి విసరగా, కొంతమంది దేశానికి మంచి రోజులు తేకుంటే పేరు మార్చుకుంటానన్న మోదీ మాటలను మళ్లీ చర్చల్లోకి తెచ్చారు.
‘పేరు మార్చుకుంటానంటే ఇలా అని అనుకోలేదు’ అంటూ టి.వివేక్ అనే వ్యక్తి ఓ మీమ్ను వదిలాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కార్టూనిస్ట్ ఇంకో అడుగు ముందుకేసి మోడీని సెక్యూరిటీ గార్డుగా చిత్రీకరించి.. ఎప్పుడో మరణించిన మాజీ ప్రధాని నెహ్రూ ఉద్యోగాలు, గ్రామీణాభివృద్ధి, భద్రతామండలిలో సభ్యత్వం వంటివన్నీ ఎత్తుకెళుతున్నట్లు చిత్రీకరించారు. దేశంలోని అన్ని సమస్యలకూ నెహ్రూ కారణమని వాదించే బీజేపీ మద్దతుదారులపై విమర్శ అన్నమాట!
అయితే, చౌకీదార్ అనే పదం అందరిలోనూ విమర్శలు మాత్రమే లేవనెత్తలేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జవహర్లాల్ యూనివర్శిటీలో ఏబీవీపీ సభ్యులతో గొడవ తరువాత కనిపించకుండా పోయిన నజీబ్ అహ్మద్ గురించి కూడా అతడి తల్లి ఒక ట్వీట్లో లేవనెత్తారు. ఫాతిమా నఫీస్ హ్యాండిల్తో ట్వీట్ చేసిన ఆమె.. ‘నువ్వు కాపలాదారువైతే నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు?’ అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఏబీవీపీ గూండాలను ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని, సీబీఐ, ఎన్ఐఏ వంటి సంస్థలు కూడా తన కొడుకు ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోయాయి? అని ప్రశ్నించింది ఆమె.
మాకొద్దీ చౌకీదార్ పని..
మోదీ చౌకీదారు వ్యాఖ్యలపై ట్విట్టర్ అకౌంట్ల విమర్శల మాటెలా ఉన్నా.. దేశంలోని అసలైన కాపలాదార్లయిన మన సెక్యూరిటీ గార్డులు ఈ అంశంపై ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ స్క్రోల్ ఒక ప్రయత్నం చేసింది. కొంతమంది గార్డులు మోదీ వ్యాఖ్య వల్ల తమకు ఒరిగేదేమీ ఉండదని, బొటాబొటీ జీతాలతో బతుకు వెళ్లదీయక తప్పదని నిష్టూరమాడారు. పదిహేనేళ్లపాటు గార్డుగా పనిచేసి పెన్షన్ కోసం తంటాలు పడుతున్న అరవై ఏళ్ల గుణశేఖర్ (బెంగళూరు) ‘ఆయన ప్రధానమంత్రి.. ఏమైనా మాట్లాడగలడు. మావేమో పేద బతుకులు. మా పని మేం చేసుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. రోజుకు పన్నెండు గంటల పాటు డ్యూటీలో ఉండటం వల్ల పెన్షన్కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోతోందని వాపోయాడు. మోదీ వచ్చాక తాము నగదు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఇక, ముంబైలో రోజుకు రెండు షిఫ్ట్లు గార్డ్గా పనిచేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్న సాగర్ తివారీ మాత్రం.. ‘టాయిలెట్లు కట్టడం దగ్గరి నుంచి మోదీ ఎన్నో మంచి పనులు చేశాడు. మై భీ చౌకీదార్ అనడం ద్వారా ప్రధాని మా పనిని గుర్తించి’నట్లు భావిస్తున్నామని చెప్పారు. మోడీ తనను తాను కాపలాదారునని చెప్పుకోవడం తనకు నవ్వు తెప్పిస్తోందన్నది చెన్నైలోని ఎస్.కుప్పన్ అభిప్రాయమైతే.. సమాజంలోని వర్గ భేదాలను తగ్గించేందుకు ఆయన వ్యాఖ్య ఉపయోగపడుతుందన్నది లక్నోకు చెందిన అఖిలేష్ సింగ్ అంచనా.