ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ జారీ

Schedule for MLC elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో మూడు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి స్థానాలు, మూడు పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ అవ్వనున్నాయి. దీంతో వీటి భర్తీకి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్‌ను శుక్రవారం జారీ చేసింది.
 
తెలంగాణలో..
రాష్ట్రంలో మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌ పదవీకాలం 2019 మార్చి 29తో ముగి యనుంది. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ టీచర్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, వరంగల్‌–ఖమ్మం–నల్ల గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ పదవీకాలం 2019 మార్చి 29తో ముగియనుంది.

ఏపీలో: ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కలిదిండి రవికిరణ్‌వర్మ పదవీకాలం, కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పదవీ కాలం మార్చి 29, 2019తో ముగియనుంది. అలాగే శ్రీకాకుళం–విజయనగరం–విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పదవీకాలం కూడా అదే రోజు ముగియనుంది.

నవంబర్‌ 1 అర్హత తేదీ..
ఆయా స్థానాల భర్తీకి వీలుగా 2018 నవంబర్‌ 1ని అర్హత తేదీగా తీసుకుని ఆయా స్థానాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. ఇందుకు అక్టోబర్‌ 1న పబ్లిక్‌ నోటీస్‌ ఇవ్వనుంది. ఆరోజు నుంచి నవంబర్‌ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ముసాయిదా జాబితాను 2019 జనవరి 1న ప్రచురిస్తుంది. మార్పులు, చేర్పులకు జనవరి 31 వరకు గడువునిచ్చింది. ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 20న విడుదల చేయనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top