ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. హోదా విషయంలో ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రం 30 ఏళ్లు అయినా వెనుకబాటుతనంలోనే ఉంటుందన్నారు. ఈ దుస్థితికి టీడీపీ సంపూర్ణ బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాలని డిమాండ్ చేశారు. హోదా వల్ల పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు.
ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో దీక్షలు చేశారని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటే చంద్రబాబు నీరుగార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి రాష్ట్ర భవిష్యత్ను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. హోదా కోసం ఇప్పుడు తాము పోరాడుతున్నామని టీడీపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు నాటకాలాడుతున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఉత్తరాఖండ్లో టీడీపీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారని ఆయన సూటిగా ప్రశ్నించారు.