ఎన్నికల వాయిదా వెనుక అనుమానాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తన పరిధిని మించి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నిర్ణయంలో దురాలోచన, దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నోటిఫికేషన్కు ముందు ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకున్నామని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని చెప్పిన ఆయన.. ఎన్నికల వాయిదా నిర్ణయం గురించి మాత్రం ఎవరితోనూ చర్చించలేదని విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా ఎన్ని చెప్పినా సత్యం ఒకటుంటుందని, ఎన్నికలు వాయిదా వేయాలంటే ఒక పద్ధతి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం అంటే ఒక వ్యక్తి కాదని వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్లోని ఏ అధికారికి తెలియకుండా రమేశ్కుమార్ వాయిదా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. (ఎన్నికలు వాయిదా: తెర వెనుక ఏం జరిగింది?!)
ఆయన నిర్ణయం అనుమానాలకు తావిస్తోంది
‘ఎన్నికల సంఘానికి ఏమైనా వార్తలు వచ్చి ఉంటే సీఎస్, హెల్త్ సెక్రటరీని పిలిచి మాట్లాడాలి. ఎన్నికల కమిషనర్ ప్రస్తావించిన జడ్జిమెంట్లో.. రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చించాలని ఉంది. కానీ అది జరగలేదు. కాబట్టి ఎవరో చెబితేనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానం వస్తోంది. ముందురోజు ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేయాలని ఆదేశాలిచ్చి.. ఆ మరుసటి రోజే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేశారు. ఈ నిర్ణయం కూడా అనుమానాలకు దారి తీస్తోంది. ఎన్నికలు జరిగి ఉంటే గ్రామ సచివాలయ వ్యవస్థతోపాటు ప్రజాప్రతినిధులు కలిసి సుపరిపాలన అందించే అవకాశం ఉండేది. కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులు కూడా వచ్చేవి. ఎన్నికల కమిషనర్కు నిబద్ధత ఉంటే ప్రభుత్వంతో చర్చించి ఉండేవారు, కానీ ఆయనపై ఏదో ఒత్తిడి పనిచేసింది’ అని సజ్జల అభిప్రాయపడ్డారు. (ఎన్నికల కమిషనర్కు సీఎస్ లేఖ)
సంబంధిత వార్తలు