‘మోసానికి, నమ్మక ద్రోహానికి ప్రతీక చంద్రబాబు’
సాక్షి, కడప: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంతంగా ఎన్నికల్లో గెలిచింది లేదని.. మాట మీద నిలిచింది లేదంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు దృష్టిలో రాజకీయం అంటే కేవలం వ్యాపారం మాత్రమేనంటూ విమర్శించారు. ఆనాడు మామ, దివంగత నేత ఎన్టీఆర్ను అధికారం నుంచి దించినప్పటి నుంచి నేటివరకు మీడియాను చంద్రబాబు ఎలా వాడుకుంటాడో అందరికీ తెలుసునన్నారు.
మోసానికి, నమ్మక ద్రోహానికి ప్రతీక చంద్రబాబు అని పేర్కొన్నారు. నమ్మకానికి, నిబద్ధతకు ప్రతీకగా జననేత వైఎస్ జగన్ కనిపిస్తారని కొనియాడారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలంటూ బూత్ కమిటీలకు సజ్జల పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు మనం ప్రభుత్వాన్ని నిర్మించాలన్నారు. ఇందులో బూత్ కమిటీల పాత్ర కీలకం అన్నారు. ప్రజలకు, పార్టీకి అనుసంధానకర్తగా బూత్ కమిటీలు పనిచేస్తాయని చెప్పారు. అందుకే పార్టీ కార్యకర్త ప్రజలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు. మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగాన్ని తీసుకురావాలంటే బూత్ కమిటీలు రథ సారధులుగా మారాలని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.