‘హోదా కోసం ఆయనొక్కరే పోరాడుతున్నారు’
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి, బాపట్ల పార్లమెంటు పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, సూళ్లురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్ కుమార్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ, సుబ్రమణ్యం రెడ్డి, సుధాకర్ రెడ్డి, వేనాటి సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబేనన్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి గ్రహణం పట్టిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ను ప్రజలు ఆదరిస్తారని జోష్యం చెప్పారు. అనంతరం తిరుపతి, బాపట్ల పార్లమెంటు పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రానున్నది ఎన్నికల సమయం.. క్షేత్ర స్థాయినుంచి అందరం కలిసి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల’ని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.