ప్రజా నాయకుడి కోసమే చట్టం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అనంతపురం : స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన ప్రజా నాయకుడిని తీసుకొచ్చేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల జోనల్ ఇన్చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సజ్జల ఇంకా ఏమన్నారంటే..
- ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే ఏ పార్టీవారైనా సరే పదవి రద్దుతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించారు.
- అభ్యర్థి స్థానికంగా ఉండాలనే నిబంధనలు తీసుకురావడం, ప్రచార గడువును తగ్గించడం వంటి సంస్కరణ తెచ్చారు.
- ప్రజా నాయకుడైతే తక్కువ ప్రచారంతోనే గెలుస్తాడు.
మంత్రి బొత్స ఏమన్నారంటే..
- సకాలంలో ఎన్నికలు జరిగితే కేంద్ర నిధులొస్తాయని, దీంతో రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో ఎన్నికలను అడ్డుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది.
- స్థానిక ఎన్నికల్లో బలహీన వర్గాలకు 59.85 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకుంటే, బడుగులపై అక్కసుతో టీడీపీ కోర్టుకెళ్లింది.
- బలహీన వర్గాలకు వైఎస్సార్సీపీ పెద్దపీట వేసింది. ఆలయ, మార్కెట్ కమిటీలు, యూనివర్సిటీ వీసీల్లో బడుగులకు అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనం.