‘ఆ విషయంలో సునీత..బాబును మించిపోయారు’
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, హైదరాబాద్ : మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేసినందుకు ఆయనకు ఓటు వేయాలా అంటూ ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలను వేధించిన దేవినేని, అచ్చం నాయుడులను మంత్రివర్గంలో పెట్టుకున్న చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కారు షెడ్డులో ఉండాలి.. మహిళ వంటింట్లో ఉండాలంటూ వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరుస్తామంటూ హామీ ఇచ్చిన బాబు.. కేవలం బ్రాహ్మణి, తన భార్యను మాత్రమే వ్యాపారవేత్తలుగా మార్చారంటూ విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు.
డ్వాక్రా మహిళలను మోసం చేయడంలో మంత్రి పరిటాల సునీత చంద్రబాబును మించిపోయారని రోజా ఎద్దేవా చేశారు. డ్వాక్రా రుణ మాఫీ చేయలేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో సునీత చెప్పారని గుర్తు చేశారు. పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి డ్వాక్రా కుటుంబాలను నిలబెట్టిన మహానేత వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత ఇటువంటి వారికి లేదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకున్నారని, ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు నిరాశలో కూరుకుపోయారన్నారు. అందరినీ మోసం చేసే చంద్రబాబును మోసగాడు అనక ఇంకేం అంటారని రోజా ప్రశ్నించారు.