నా విజయమే టీడీపీ నేతలకు చెంపపెట్టు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, తిరుమల : ‘నన్ను ఐరన్ లెగ్ అని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు, నా విజయమే చెంపపెట్ట’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారామె. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి దుబారా ఖర్చుల వల్ల రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా సాదా సీదాగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ బాధ్యత అప్పగించినా వైఎస్ జగన్ గారికి మంచి పేరు తెస్తానన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ కష్టాలను దూరం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.