‘పాస్పోర్టు కేసులో కేసీఆర్ దొంగ’
కేసీఆర్, హరీష్పై నిప్పులు చెరిగిన రేవూరి ప్రకాష్రెడ్డి
సాక్షి, వరంగల్ అర్బన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావుపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దొంగ పాస్పోర్టు కేసులో కేసీఆర్, మనుషుల అక్రమరవాణా కేసులో హరీష్రావు నిందితులని ఆరోపించారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఒంటిపై పెట్రోల్ పోసుకుంటే కేసీఆర్, హరీష్రావు అగ్గిపుల్ల గీసి.. 1200 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను ఖండించారు. చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. ‘రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడు, ఓటమి భయం వల్లనే అలా మాట్లాడుతున్నావ్.. ఎన్నికల తరువాత మెంటల్ ఆసుపత్రిలో చేర్చడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు. (మీ బతుకు చెడ.. చంద్రబాబుతో పొత్తా!)
అందుకోసమే కూటమి..
అమరవీరుల ఆశయాలను నెరవేర్చడం కోసమే కూటమిగా ఏర్పడుతున్నామని రేవూరి అన్నారు. కోదండరాం వల్లనే తెలంగాణ ఉద్యమం ఉధృతమై తెలంగాణ సిద్ధించిందని అన్నారు. అంతేతప్ప కేసీఆర్ వల్ల కాదని అన్నారు. కూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ 2004, 2009 ఎన్నికల్లో ఎన్ని కోట్లు తీసుకున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు.