కాంగ్రెస్తో చర్చలపై స్పందించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంటున్న వేళ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తనతో చర్చలు జరుపుతున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. టీఆర్ఎస్తో పొత్తుపై స్పష్టత ఇస్తే తన దారి తాను చూసుకుంటానంటూ రేవంత్ రెడ్డి... బంతిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోర్టులోకి నెట్టారు. తెలంగాణలో టీడీపీని టీఆర్ఎస్ను విలీనం చేస్తారని వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ... తన నియోజకవర్గ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.
కాగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రేవంత్రెడ్డి నిన్న పేర్కొన్న విషయం విదితమే. తాను ఓ కేసు విషయమై న్యాయవాదులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే విదేశీ పర్యటన కోసం ఢిల్లీలో విమానం ఎక్కేందుకు వచ్చిన చంద్రబాబును కలిసేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నించినా.... చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. కంభంపాటి.. అధిష్టానం దూతగా వచ్చినట్లు సమాచారం. పార్టీ మారవద్దని రేవంత్రెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. సుమారు అరగంటపాటు జరిగిన భేటీ అనంతరం కంభంపాటి మాట్లాడుతూ... తాను వ్యక్తిగతంగానే రేవంత్రెడ్డిని కలిసినట్లు చెప్పారు. అయితే ఆయన పార్టీ మారతానుకోవడం లేదని అన్నారు.