స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా?

Resign in speaker format - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి పునరుద్ఘాటించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తాము రాజీనామాలు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాజీలేని పోరాటం చేసేందుకు తమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్‌ రాష్ట్రం స్వాగతిస్తోందని తెలిపారు. వివక్షతో కళ్ళు మూసుకుపోయిన తెలుగుదేశం పార్టీ వక్ర భాష్యాలు చెబుతోందని ధ్వజమెత్తారు.

ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనే సత్తా తమకుందని, పార్టీ ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాము 14 నెలల ముందే పార్లమెంట్‌కు రాజీనామా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఉప ఎన్నికల ద్వారానే ప్రత్యేక హోదా అవసరమని ప్రజాభీష్టాన్ని కేంద్రానికి తెలిపేలా చేస్తామని చెప్పారు.

చంద్రబాబు మళ్లీ తన రెండు నాల్కల సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చారని మిథున్‌ విమర్శించారు. హోదాను మేనిఫెస్టోలో పెట్టిన ఆయన ఎవరి ఆమోదంతో ప్యాకేజీకి అంగీకరించారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఎవరితోనైనా కలసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మిథున్‌ చెప్పారు. అవసరమైతే గొంగళి పురుగైనా ముద్దాడతామన్నారు. హోదా కోసం తాము రాజీనామాలకు సిద్ధపడితే టీడీపీ రాద్ధాంతం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top