రజనీకాంత్కు ఆ పార్టీయే కరెక్టు: కమల్హాసన్
చెన్నై: త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని సీనియర్ నటుడు కమల్హాసన్ తెలిపారు. రాజకీయాల్లోకి వస్తున్న విషయం రజనీకాంత్కు చెప్పానని వెల్లడించారు. రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రజనీకాంత్కు బీజేపీయే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరే తన ముఖ్య ఎజెండా అని, తమిళనాడు ప్రజలకు మంచి రోజులు తీసుకొస్తానని ‘సీఎన్ఎన్-న్యూస్ 18’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు.
‘రజనీకాంత్తో తరచుగా మాట్లాడుతుంటాను. అతడు నాకు మిత్రుడు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విషయం ఆయనతో చెప్పాను. ఇప్పటికైతే ఎటువంటి ప్రణాళికలు లేవు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆయనుకున్న మత విశ్వాసాలను బట్టి చూస్తే కాషాయ పార్టీకి మంచి భాగస్వామి అవుతారనిపిస్తోంది. నేను హేతువాదిని. కులవ్యవస్థకు నేను వ్యతిరేకిని. అలాగని నేను కమ్యూనిస్టును కాదు. నేను అభిమానించే కథానాయకుల్లో కొంత మంది కమ్యూనిస్టులు ఉన్నారు. తమిళనాడులో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను. కొత్త ఏడాదిలోగా పార్టీ పెట్టాలనుకుంటున్నాను. దీని కోసం చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నాను. అయితే పార్టీ ఏర్పాటుకు కచ్చితమైన సమయం చెప్పలేన’ని కమల్హాసన్ అన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
సంబంధిత వార్తలు