రెండు చోట్ల రాహుల్ గాంధీ పోటీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీతో పాటు కేరళలోని వాయినాడ్ నుంచి రాహుల్ పోటీ చేయనున్నట్లు పార్టీ నేత ఏకే ఆంటోని ఆదివారం మీడియాకు తెలిపారు. రాహుల్ను పోటీ చేయాల్సిందిగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వినతులు అందాయని, అయితే ఎట్టకేలకు రెండో స్థానంగా వాయినాడ్ నుంచి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించారని ఆయన చెప్పారు. రాహుల్ తాజా నిర్ణయంపై కేరళ కాంగ్రెస్ వర్గాలు హర్షాతిరేకం వ్యక్తం చేశాయి. ఇక తొలిసారి రాహుల్ గాంధీ రెండు చోట్ల బరిలో దిగుతుండగా.. అమేథీలో ఓడిపోతానన్న భయంతోనే రెండు స్థానాల్లో పోటీచేస్తున్నారని బీజేపీ విమర్శించింది.
ఈ వ్యాఖ్యలను ఆంటోని తిప్పికొట్టారు. బీజేపీ నేతలు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని, మరీ నరేంద్రమోదీ గుజరాత్ను వదిలేసి వారణాసి నుంచి ఎందుకు పోటీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మోదీ కూడా ఓటమి భయంతోనే వారణాసికి వచ్చారా? అని నిలదీశారు. స్మృతి రాణికి హ్యాట్రిక్ పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్మృతి ఇరాని.. రాహుల్ చేతిలో ఘోరపరాజాయన్ని చవిచూసింది. ఇక రాహుల్ ఎంచుకున్న వాయ్నాడ్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటలాంటింది. 2009, 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి షాన్వాజ్ గెలుపొందాడు.