మోదీజీ.. నీరవ్ను తీసుకురా: రాహుల్
షిల్లాంగ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో చురుగ్గా పాల్గొంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బ్యాంకులను వేల కోట్లు మోసగించిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి పారిశ్రామికవేత్తలు దేశం దాటిపోయేలా సహకరించిందని మండి పడ్డారు. త్వరలో ఎన్నికలు జరగబోయే మేఘాలయాలోని తురా, షిల్లాంగ్లో ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి, భద్రత కల్పించడానికి బదులు కేంద్రం నిరుద్యోగం, విద్వేషాలతో భయపెడుతోందని అన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నీరవ్ మోదీని భారత్కు తిరిగి తీసుకురావాలని అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని తిరిగి తెస్తే దేశమంతా ప్రభుత్వానికి రుణ పడి ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని మేఘాలయ ఓటర్లకు పిలుపునిచ్చారు.