తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ
లక్నో : బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి యూపీలోని పలుచోట్ల బలహీన అభ్యర్థులను బరిలోకి దింపామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వ్యాఖ్యలను ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటు మాయావతి కూడా కొట్టిపారేశారు. అంతేకాక బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అఖిలేశ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాయ్బరేలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక అఖిలేష్ విమర్శలపై స్పందించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బీజేపీకి సాయం చేయడం కన్నా నన్ను నేను చంపుకోవడమే మంచిదని భావిస్తానం’టూ తీవ్రంగా స్పందించారు. అంతేకాక ‘బీజేపీ విధ్వంసక భావజాలాన్ని నా జీవితంలో ఎన్నటికి అంగీకరించను. యూపీలో బరిలో నిలిచిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు బీజేపీ ఒట్లను చీలుస్తారు. ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. మా పార్టీ అభ్యర్థులంతా చాలా బలంగా ఉన్నారు. బీజేపీకి గట్టి పోటీ ఇస్తారు. వారు సొంతంగానే విజయం సాధిస్తార’ని ప్రియాంక ధీమా వ్యక్తం చేశారు.