136వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. శనివారం నుంచి ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగనుంది. కనకదుర్గ వారధి వద్ద యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి నుంచి శనివారం ఉదయం 136వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. కనకదుర్గ వారధి గుండా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్ సెంటర్, సీతారాంపురం సెంటర్ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. అక్కడినుంచి బీఆర్టీఎస్ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చిట్టినగర్ సెంటర్లో జరిగే బహిరంగం సభలో జననేత ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద యాత్ర ముగిస్తారు.