బ్రోకర్ చంద్రబాబు మాటలు నమ్మాలా?
హోదా అంశంలో టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన పోసాని
అధికార పార్టీ నేతల విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీపరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.
అవును.. సినిమా వాళ్లకు చేతగాదు: ‘మేం ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. అవును, మాకు ఏదీ చేతకాదనుకుందాం, మరి మీరేం చేస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని లాఠీలతో కొట్టించింది మీరుకాదా, ఒక్కొక్కరినీ తరిమితరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా? నిన్నటిదాకా మీరేం మాట్లాడారు.. హోదా కోసం మాట్లాడినవాళ్లను చెత్తవెధవలని అనలేదా? మళ్లీ మీరిప్పుడు సడన్గా హోదా కావలంటుంటే మేం మద్దతివ్వాలా?
బ్రోకర్ మాటలు నమ్మాలా?: అసలు హోదానే వద్దని చంద్రబాబు చెబితే మనస్ఫూర్తిగా నమ్మాం. ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటల్లో నిజం ఉంటుందని ‘హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు’ అనుకున్నాం. ఇప్పుడు మోదీతో చంద్రబాబుకు ఏవో గొడవలొస్తే అదేదో ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ మాటతప్పినవాళ్లను లోఫర్ అనేకదా అంటారు. ‘ఎస్సీల్లో పుట్టాలని కోరుకోరుకదా..’ని చంద్రబాబు అంటే మేం జేజేలు కొట్టాలా, డబ్బులిచ్చి పక్కపార్టీ ఎమ్మెల్యేలను కొనుకుక్కుంటే సంతోషంగా మద్దతు పలకాలా? బ్రోకర్ చంద్రబాబు మాటలు నమ్మి మేం పోరాటాలు చెయ్యాలా..’ అని పోసాని ఫైర్అయ్యారు.
హోదా రావాలంటే ఇదొక్కటేదారి: ఆంధ్రప్రజలకు పోరాటాలు కొత్తకాదని, నాయకులు నాడు ‘జై ఆంధ్ర’ అన్నా, నిన్ని ‘సమైక్యాంద్రా’ అన్నా, నేడు ‘ప్రత్యేక హోదా’ పిలుపిచ్చినా జనం స్పందించి, రోడ్ల మీదికి వచ్చారని, అయితే అన్ని సందర్భాల్లోనూ పాలకులు మోసం చేశారని పోసాని గుర్తుచేశారు. ‘మొన్నీమధ్యే హోదా కోసం విజయవాడలో ఆందోళన చేసిన సినిమావాళ్లని పోలీసులొచ్చి వీపులు పగలగొట్టారు! ఎందుకంటే అప్పుడు సీఎం చంద్రబాబుకుగానీ, టీడీపీకిగానీ హోదా అవసరం రాలేదు. హోదా కన్నా ప్యాకేజీనే మంచిదని చంద్రబాబు చెబితేనే మేమంతా(టాలీవుడ్) కామ్గా ఉండిపోయాం. సరే, ఇప్పటికైనా హోదా రావాలంటే ఒకేఒక్క దారి ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ అందరూ విజయవాడ నడిబొడ్డున నిరాహారదీక్షకు దిగాలి. టాలీవుడ్ తరఫున నేనూ ఆమరణదీక్షకు కూర్చుంటా. మళ్లీ చెబుతున్నా.. హోదా కోసం ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధం.. టీడీపీ నేతలు కూడా సిధ్దమే అయితే రండి. అలా కాకుండా నోటికొచ్చినట్లు కూస్తే మాత్రం నేను సహించను’’ అని పోసాని అన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి