బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్ గల్లంతు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరని, వేరే పార్టీల్లో టికెట్లు రాని ఫిరాయింపుదారులను చేర్చుకొని బరిలో దింపాలని చూస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మొత్తం స్థానాల్లో పోటీ చేసినా వంద స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మంగళవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్ర శ్నించారు. దానికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.
అమిత్షా భారతీయ జూటా పార్టీ అధ్యక్షుడని అభివర్ణించారు. కరీంనగర్లో సభ పెట్టి ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ సహకారంతోనే కేసీఆర్ తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు తెరదీశారని పొన్నం ఆరోపించారు. కేసీఆర్ మోదీ కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని చెప్పారు.