తీరు మార్చుకోకపోతే ఖబడ్దార్
టీఆర్ఎస్ నేతలకు మాజీ ఎంపీ పొన్నం హెచ్చరిక
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేకుంటే తరిమికొట్టే రోజులొస్తాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కరీంనగర్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కావాల్సిందేనని టీఆర్ఎస్ పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఫోరం పెట్టిందన్నారు. తెలంగాణ కోసం పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉం టూనే పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్ ఎంపీలమంతా రాజీలేని పోరాటం చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ ఎక్కడ ఉండేవారో ఊహించుకోవాలని సూచించారు. కేసీఆర్తోపాటు అప్పటి ఎంపీ విజయశాంతి తెలంగాణ కోసం పార్లమెంట్లో ఏనాడూ మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. విభజన హామీలపై కాంగ్రెస్పై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు.