ఈ బాబు మన బాబే!
పొత్తుతో తెలుగుదేశం పార్టీ తప్పులన్నీ మాఫీ
‘ఓటుకు కోట్లు’ కేసు ఇక కాంగ్రెస్ సొంతం
టీఆర్ఎస్ ప్రశ్నిస్తే కేసీఆర్పై కేసులు లేవనెత్తండి
టీడీపీ స్కాంలను ప్రస్తావిస్తే ఎదురుదాడికి దిగండి
పొత్తు అపవిత్రమంటే.. దీటుగా స్పందించండి
ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు టార్గెట్ కావొద్దు
‘తెలుగుదేశం’ఆంధ్ర పార్టీ అంటే.. తిప్పికొట్టండి
అంతిమంగా ఎన్నికల్లో గెలుపు మాత్రమే ముఖ్యం
శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర నేతలతో రాహుల్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్
‘ఇంతకాలం తెలుగుదేశం పార్టీ తప్పొప్పులను ఎత్తిచూపాం. ఇప్పుడు కాలం మారింది దానితో పాటే మనమూ మారాలి. చంద్రబాబు ఏది చెప్పినా అదే కరెక్ట్ అనాలి. తెలుగుదేశం ఏం చేసినా దానిని ఫాలో కావాలి. బాబుపై ఇతర పక్షాలు ఆరోపణలు చేస్తే తిప్పికొట్టండి. టీడీపీ ఆంధ్ర పార్టీ అంటే తెలంగాణ వచ్చాక ఇలాంటి ఆరోపణలకు పసలేదని చెప్పండి. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తెరమీదకు తెస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయన మంత్రివర్గ సహచరులపై ఉన్న కేసులను ప్రస్తావించండి. మన పొత్తు అపవిత్రమని బీజేపీ అంటే దానికి సరైన సమాధానం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ధర్మా న్ని కాపాడుకోవాలి’కాస్త అటో.. ఇటో.. ఇందులో మార్పులు ఉండొచ్చు గానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధినేత రాహుల్గాంధీ చేసిన హితోపదేశ సారాంశం ఇదే.
కర్నూలు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలతో రాహుల్ కొద్దిసేపు సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ భేటీలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం కొద్దిమంది కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో చర్చిస్తుండగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
‘ఓటుకు కోట్లు’ కేసు ఇక కాంగ్రెస్ సొంతం...
శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వజూపిన కేసులో టీడీపీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి (అనంతరం కాంగ్రెస్లో చేరారు), సండ్ర వెంకటవీరయ్య అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రాథమిక చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగం నిర్ధారణ కూడా చేసింది. కాగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఇది ప్రధాన ఎజెండా కావచ్చన్నది రాహుల్ ఆలోచన. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆయన ముందస్తుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది. స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ పట్టుబడిన రోజున కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసింది. ఇప్పటికీ అడపా దడపా ఈ కేసు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు.
ఇప్పుడు రాహుల్ ఓటుకు కోట్లు కేసును టీఆర్ఎస్ ప్రస్తావిస్తే రెచ్చిపోవద్దని, టీడీపీకి ఇబ్బంది కలిగించే ఎటువంటి ప్రకటన చేయొద్దన్నట్లు చెప్పినట్లు తెలిసింది. ఇది కాంగ్రెస్ పార్టీని మరింతగా భ్రష్టు పట్టించడమేనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ‘కాంగ్రెస్ ఒంటరిగా ప్రయాణం చేస్తే ఇప్పుడు కాకుంటే 2023లో అధికారంలోకి వస్తుంది. కానీ, టీడీపీతో కలిస్తే కోలుకోవడానికి మళ్లీ పదిహేనేళ్లు పడుతుంది. చంద్రబాబుతో జత కట్టిన కమ్యూనిస్టులు ఏమయ్యారో, బీజేపీ ఎలా దెబ్బతిన్నదో చరిత్ర చూస్తే తెలిసిపోతుంది. కానీ, కాంగ్రెస్ ఆ విషయాలను గ్రహించడం లేదు’అని ఓ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటుకు కోట్లు కేసును సమర్థించడానికి వీలుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులపై ఉన్న పాత కేసులను తిరగదోడే పనిలో కాంగ్రెస్ నిమగ్నమై ఉంది. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సహార కేసులో కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో గల్ప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేశారన్న ఆరోపణలు సంధించడానికి సమాయత్తమవుతోంది.
టీడీపీ కుంభకోణాలకు కాంగ్రెస్ కౌంటర్...
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి ప్రభుత్వంలో వెలుగుచూసిన కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ ఇంటెలీజెన్స్ అధికారులు చంద్రబాబు దృష్టికి కూడా తెచ్చారు. చంద్రబాబు దౌత్యం కాబోలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దానికి కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. బాబు కుంభకోణాలనే కాంగ్రెస్ నేతలు 2004 ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘మాకు సంకటం వచ్చి పడింది. ఇప్పుడు మేము వాటికి అనుకూలంగా మాట్లాడే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వచ్చాయి. ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి దురవస్థ రాకూడదు. ఐఎంజీ కుంభకోణాన్ని ఇప్పుడు మేము సమర్థించాలా? చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలోని భూములను తన అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టడాన్ని కరెక్ట్ అని చెప్పాల్నా’అని తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చి చివరకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కూడా తానే కట్టానని అంటుంటే తాము గంగిరెద్దుల్లా తలూపాల్సి ఉంటుందేమోనని మరో నాయకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం సైబర్ టవర్స్ మాత్రమే పూర్తయ్యిందని, హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం 2004–09 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గోరంత చేసి కొండంత చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చేవారు కూడా ఉండరంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటే టీఆర్ఎస్ కూడా పట్టించుకోదని ఎటొచ్చి తాము చేసిందంతా గంగలో కలిపేట్టు ఉన్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
పొత్తు ధర్మం ముఖ్యమే... కానీ,
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ వెనకేసుకురావాల్సిన అవసరం ఏముందన్నది కాంగ్రెస్ సీనియర్ల ప్రశ్న. పొత్తు ధర్మం అంటే ఆ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీలో ఉండకూడదు. టీడీపీ అభ్యర్థులకు పూర్తిగా సహకరించాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో దాని అర్థమే మారిపోయిందని రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు, టీడీపీ తప్పులను కాంగ్రెస్ వెనకేసుకు రావడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదన్నది వారి వాదన. రాహుల్ ఆదేశాలను కాంగ్రెస్ నేతలు తూ.చ. తప్పకుండా పాటిస్తారో లేదా టీడీపీ గోల తమకెందుకని వదిలేస్తారో అనేది వేచి చూడాల్సిందే!