పోలీసులు అమాయకుల్ని చంపలేదు: సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఓ జాతీయ వార్తాచానల్తో ఆయన సంభాషించారు. ఉన్నావ్ ఘటన గురించి ప్రస్తావించగా.. తమ ప్రభుత్వం ఇలాంటి ఘటనలను సహించదని చెప్పారు. ఈ ఉదంతంలో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి, పారదర్శకత కోసం 48 గంటల్లోనే కేసును సీబీఐకి అప్పగించామని యోగి గుర్తు చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని.. తమ ప్రభుత్వం కుల, మత, వర్ణ, లింగ వివక్షకు అతీతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సుమారు 1200 ఎన్కౌంటర్లు జరిగాయని, నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొన్న సుమారు 40 మంది హతం కాగా.. మరో 247 మంది గాయపడ్డారు కదా అన్న ప్రశ్నకు బదులుగా.. పోలీసులు అమాయక ప్రజల జోలికి వెళ్లరని.. కేవలం తమ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తారని యోగి పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపే సందర్భాలు కూడా ఉంటాయన్నారు. ఈ ఎన్కౌంటర్లలో మరణించిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న విషయాన్ని యోగి వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.