సంచలన వ్యాఖ్యలు చేసిన మోదీ
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ పార్టీకి చెందిన ఓ 40 మంది ఎమ్మెల్యేలు తనతో కాంటాక్ట్లో ఉన్నారు జాగ్రత్త అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హెచ్చరించారు. సీరంపోర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ‘దీదీ, ఫలితాల రోజున అనగా మే 23న దేశవ్యాప్తంగా కమలమే వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారు. అప్పుడు ప్రభుత్వాన్ని నడపడం మీకు కష్టంగా మారుతుంది. ఈ రోజు కూడా మీ పార్టీకి చెందిన ఓ 40 ఎమ్మెల్యేలు నాతో కాంటాక్ట్లో ఉన్నార’ని మోదీ వ్యాఖ్యానించారు.
అంతేకాక బెంగాల్ ప్రజలు దీదీ పాలనతో విసిగిపోయారని మోదీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనుమతుల నుంచి అడ్మిషన్ల దాకా ప్రతి దానికి డబ్బు చెల్లించాలన్నారు. కాదని ఎదురుతిరిగితే వారిని ఉరి తీస్తారని ఆరోపించారు. ‘బెంగాల్లో అణచివేత పాలన కొనసాగుతుంది. ఇక్కడ దైవ భక్తులు ప్రమాదం నీడలో జీవిస్తుంటే.. చొరబాటుదారులు మాత్రం హాయిగా బతుకుతున్నారు. దీదీ పాలనలో గుండాలకు పూర్తి భద్రత ఉంది. కానీ కూతుళ్లకు, చెల్లెళ్లకు మాత్రం రక్షణ కరువయ్యింద’ని విమర్శించారు. మోదీ వ్యాఖ్యల పట్ల తృణమూల్ నేతలు మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.