చంద్రబాబు ఇక జీవితంలో మారడు
మంత్రి పేర్ని నాని ఆగ్రహం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం నాటి ప్రెస్మీట్ చూస్తే ఆయన జీవితంలో మారడని, ఏపీ బాగుపడడం ఆయనకు ఇష్టం లేదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎనిమిది నెలలుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు 90 శాతం కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రజల మనోభావాలతో పని లేకుండా తాను మేనేజ్ చేసుకున్న జాతీయ మీడియా ఏమనుకుంటోందంటూ తోక పత్రికలు ఏరుకుని వచ్చిన వార్తలను చంద్రబాబు ప్రెస్మీట్లో చదివి వినిపించారని మండిపడ్డారు.
ఈ మేరకు మంత్రి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రదర్శించిన వీడియోల్లో రేవంత్రెడ్డి తెలంగాణలో డబ్బుల మూట ఇస్తూ పట్టుబడిన దృశ్యాలు, తాను ‘బ్రీఫ్డ్మీ...’ అనే ఆడియోను కూడా ప్రదర్శించి ఉంటే మరింత బాగుండేవన్నారు. చంద్రబాబు దుర్మార్గాలపై రాష్ట్ర ప్రజలను మాట్లాడిస్తే ప్రపంచంలో ఉన్న మొత్తం స్టోరేజీ డివైస్లు సరిపోవని ఎద్దేవా చేశారు.
ఈ ప్రశ్నలకు ఎందుకు స్పందించరు?
‘అమరావతిలో ఐదేళ్లలో ఏం కట్టారంటే..? చంద్రబాబు మాట్లాడరు. మూడు ప్రాంతాలకూ మీరు చేసిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదంటే..? స్పందించరు. ప్రజలకు ఎందుకు అన్యాయం చేశారంటే..? మాట్లాడరు. నిజంగా అమరావతిని అభివృద్ధి చేస్తే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎందుకు ఓడారంటే..? మాట్లాడరు. కనీసం ల్యాండ్ పూలింగ్ ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థనైనా ఏర్పాటు చేయగలిగారా? అంటే నోరెత్తరు’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయటం అవసరం అని సీఎం జగన్ అంటే.. బాబు వ్యతిరేకిస్తున్నాడని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన నగరంలో సచివాలయం ఉంటే మౌలిక సదుపాయాలకు పెట్టుబడుల అవసరం ఉండదని శంఖం ఊదుతున్నా ఆయనకు వినిపించడం లేదని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు