జగన్ అంటే జనం
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగింది. సంగం నుంచి యాత్ర ప్రారంభమై, దుండిగం క్రాస్రోడ్డు వరకు సాగింది. ఏఎస్పేట మండలం హసనాపురంలో ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాదయాత్ర సాగిన ఆద్యంతం రహదారుల వెంబడి జననేత వైఎస్ జగన్కు జనం ఆత్మీయస్వాగతం పలికారు. ఆయన వెంటే అడుగులు వేస్తూ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. పలువురు జననేత వైఎస్ జగన్ను కలిసి తమగోడును వెళ్లబోసుకున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇస్తూ జగన్మోహన్రెడ్డి ముందుకు కదిలారు.