ఆదుకుంటామని చేతులెత్తేశారయ్యా.. 

People mentioned there problems to YS Jagan At P Gannavaram - Sakshi

     ఒళ్లంతా కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్నాం 

     ప్రభుత్వం, గెయిల్‌ సంస్థ పట్టించుకోలేదు..   

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వద్ద గోడు వెళ్లబోసుకున్న గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు ప్రమాద బాధితులు 

     దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న ప్రజలు 

     మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని జననేత భరోసా 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ఒళ్లంతా కాలిపోయి నరక యాతన అనుభవిస్తున్నాం.. కాయకష్టంతో పోగు చేసుకున్న డబ్బు అంతా వైద్య ఖర్చుల కోసం కర్పూరంలా కరిగిపోయింది. ఏదైనా పని చేసుకొని బతుకుదామంటే గాయాల కారణంగా అవయవాలు సరిగా పని చేయడం లేదు. ఆదుకుంటామని చెప్పిన పాలకులు పట్టించుకోలేదు. ఇలాగైతే ఎలా బతకాలయ్యా..’ అంటూ గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ విస్ఫోటనం వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాల వారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 197వ రోజు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగించారు. 

మన కష్టాలు వినే నాయకుడు వచ్చారంటూ ఊరూరా జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూ సమస్యలు చెప్పుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని నగరం గ్రామంలో 2014 జూన్‌ 27న  గెయిల్‌ (గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలడం వల్ల 22 మంది మృతి చెందడం, పలువురు గాయపడటం తెలిసిందే. మృతి చెందిన వారితో సమానంగా తీవ్రంగా గాయపడిన వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన పాలకులు ఆ తర్వాత పట్టించుకోలేదని బాధితులు వైఎస్‌ జగన్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బోనం పెద్దిరాజు అనే బాధితుడు మాట్లాడుతూ.. ‘అన్నా.. విస్పోటనంలో నాతో పాటు నా భార్య రత్నకుమారి కూడా తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ రెండేళ్ల తర్వాత మృతి చెందింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించినట్లే నా భార్యకు కూడా ఇవ్వాలని అప్పటి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా గెయిల్‌ కంపెనీకి లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు పరిహారం అందలేదు. చికిత్స కోసం అయిన ఖర్చు కూడా గెయిల్‌ కంపెనీ చెల్లిస్తుందని ప్రభుత్వం ప్రకటించినా అతీగతీ లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో బాధిత మహిళ వానరాసి దుర్గాదేవి మాట్లాడుతూ ఈ ప్రమాదంలో తన కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారని తెలిపారు. 80 శాతం కాలిన గాయాలతో ఇబ్బంది పడుతున్న తన కుమారుడు వెంకట కృష్ణకు గెయిల్‌ సంస్థ సర్జరీ చేయిస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. కాలిన గాయాలకు గురైన వారికి రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ప్రస్తుతం ప్లాస్టిక్‌ సర్జరీ చేయించాలంటే లక్షలకు లక్షలు అడుగుతున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. వారి సమస్యను ఓపికతో విన్న జననేత.. వారికి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసా కల్పించారు.   
  
ఇళ్లు పడగొట్టి రైలు పట్టాలు వేస్తారట.. 
కూలి నాలి చేసుకొని ఇళ్లు నిర్మించుకుంటే వాటిని పడగొట్టి కోటిపల్లి–నర్సాపురం రైలు మార్గం వేస్తామంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాగైతే తమ బతుకులు బుగ్గి పాలవుతాయని పలువురు బాధితులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ రైలు మార్గాన్ని మళ్లించేలా చూడాలని కోరారు. లక్షల్లో బకాయిలున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా కృషి చేయాలని పంచాయతీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు రామకృష్ణ తదితర ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు. కేవలం రూ.3 వేల జీతంతో బతకలేకపోతున్నామని, తమను పర్మినెంట్‌ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమ సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల యూనియన్‌ నాయకుడు బి.రామరాజుతో పాటు పలువురు ఉద్యోగులు కోరారు.  
 
ఆధార్‌తో సంబంధం లేకుండా స్కాలర్‌షిప్పులు ఇవ్వాలి 
ఆధార్, రేషన్‌ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్పులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిగ్రీ చదువుతున్న నవీన్‌ ప్రసాద్‌ అనే విద్యార్థి జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ తీరు వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే జన్మభూమి కమిటీ సభ్యులతో చెప్పించాలంటూ అధికారులు చెబుతున్నారని ములికిపురం వద్ద దివ్యాంగుడైన పితాని ఏసుబాబు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. దివ్యాంగుల పట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాడు. 70 శాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.1500 పింఛన్‌ ఇవ్వాల్సి ఉండగా రూ.1000 మాత్రమే ఇస్తున్నారని కడలి గ్రామానికి చెందిన యన్నాబత్తుల సమీర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చింది. తమకు వేతనాలు పెంచేలా కృషి చేయాలని పలువురు ఆశావర్కర్లు జగన్‌కు విన్నవించారు. తెల్లరేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే పెన్షన్‌ తీసుకుంటున్న వారు అనర్హులని చెబుతున్నారని, ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన తన భర్తకు వస్తున్న రూ.2 వేల పింఛన్‌తో ఎలా బతకాలని వేగివారిపాలెంకు చెందిన చెల్లుబోయిన సావిత్రి జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అందరికీ ధైర్యం చెబుతూ.. మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని జగన్‌ భరోసా ఇచ్చారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top